08-09-2025 06:17:56 PM
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): దైనందిన జీవితంలో శారీరక సామర్థ్యానికి ఫిజియోథెరపీ ఎంతో అవసరం అని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ హనుమకొండ, అగస్త్య హాస్పిటల్స్, వినాయక న్యూరో కేర్ మల్టీ స్పెషాలిటీ సెంటర్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ఫిజియోథెరపీ ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, తాను ఒక క్రీడాకారున్ని అని ఫిజియోథెరపీ ప్రాముఖ్యత ఏంటో తనకు ప్రత్యక్షంగా తెలుసన్నారు.
ముఖ్యంగా పక్షవాతం, మెడ నొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు, భుజం నొప్పులు వంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు ఫిజియోథెరపీ ద్వారా ఉపశమనం పొందవచ్చు అన్నారు. మరో ముఖ్య అతిథి డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఫిజియోథెరపీ ద్వారా పేషెంట్ కు ముఖ్యంగా క్రోనిక్ డిసీజెస్ అయిన పక్షవాతం, కీళ్ల నొప్పులు వంటి నొప్పులకు శాశ్వత వైద్యం ఫిజియోథెరపీ ద్వారా ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా పిల్లల ఎదుగుదల లోపాలున్న, కాళ్లు చేతులు సరిగా పనిచేయకపోయినా, ముసలి వాళ్ళలో కండరాల సమస్యలు, నరాల సమస్యలు వంటివి ఉన్నట్లయితే ఫిజియోథెరపీ ద్వారా పూర్తిగా వైద్యం అందించడం జరుగుతుందన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 10 ఫిజియోథెరపీ కళాశాలలు మంజూరు చేసినందుకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఫిజియోథెరపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు సహకారం అందిస్తే గ్రామ గ్రామాన ఫిజియోథెరపీ సెంటర్లు పెట్టి ప్రజలకు సేవ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ బాధ్యులు పొట్లపల్లి శ్రీనివాసరావు, కన్నా పరశురాములు, ఎం. పద్మజారాణి, డాక్టరు రాము, సౌజన్య, కాకతీయ, వాగ్దేవి ఫిజియోథెరపీ కళాశాల విద్యార్థినీ,విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.