04-09-2025 01:26:04 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): ఎస్ఎల్బీసీ పనుల పునరుద్ధరణ కోసం ప్రణాళికలు రూపొందించామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు. రాష్ర్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పించినట్లు పేర్కొన్నారు. ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
అందులో భాగంగా గురువారం సీఎం రేవంత్రెడ్డితో సమావేశం కానున్నట్లు తెలిపారు. ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ పనుల పురోగతిపై బుధవారం సచివాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖ ప్రధాన కార్య దర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సలహాదారులు అదిత్యా నాథ్ దాస్, లెఫ్టినెంట్ జెనరల్ హార్పల్ సింగ్, సహాయ కార్యదర్శి కే శ్రీనివాస్, ఈఎన్సీలు అంజత్ హుస్సేన్, శ్రీనివాస్, రమేష్బాబులతో పాటు ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు, సీఈ నల్గొండ అజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్కుమా ర్రెడ్డి మాట్లాడుతూ.. నెలకు 178 మీటర్ల సొరంగం తవ్వడం లక్ష్యంగా పెట్టుకుని జనవరి 2028 నాటి కి పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు. మొత్తం 44 కిలోమీటర్ల సొరంగమార్గానికి గానూ ఇప్పటికే 35 కిలో మీటర్ల సొరంగం పూర్తి అయ్యిందని, మిగిలిన తొమ్మిది కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వడానికి గాను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించబోతున్నట్లు తెలిపారు.
అందులో భాగంగా ప్రపంచం మొత్తంలో అత్యాధునిక సాంకేతికతో కూడిన హెలీ-బోర్న్ సర్వే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ద్వారా ఈ సర్వే నిర్వహించనునట్లు తెలిపారు. తద్వారా సొరంగ మార్గం తవ్వకాల సమయంలో ప్రమాదాలను ముందుగానే పసిగట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకునే వెసులు బాటు ఇంజినీర్లకు ఉంటుందన్నారు.
నీటిపారుదల సలహాదారుడిగా లెఫ్టినెంట్ జెనరల్ హార్పల్ సింగ్ నియామకం ఈ సొరంగ మార్గం పూర్తికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎటువంటి జాప్యం లేకుండా సత్వరమే సర్వే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మూడు షిఫ్ట్ లలో పనిచేసేవిదంగా ప్రణాళికలు రూపొందించుకుంటే నిర్ణిత వ్యవధిలో పనులు పూర్తి అవుతాయన్నారు. ఆయా షిఫ్ట్లలో యువ ఇంజినీర్లను నియమించి రోజువారీ పురోగతిని రికార్డ్ చేయాలన్నారు.
సవరించిన అంచనాల పరిధిలోనే ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆయన ఏజెన్సీలకు సూచించారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం తవ్వకాల సమయంలో వస్తున్న నీటిని పంపింగ్ చేయడానికి విద్యుత్ బిల్లులు సంవత్సరానికి 500 నుండి 550 కోట్లు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. పైగా పంపింగ్ కోసం వినియోగిస్తున్న మోటార్లు 20 సంవత్సరాలు పూర్తి కావడంతో అదనపు భారాన్ని భరిస్తూ మోటార్లను మార్చాల్సి వస్తుందన్నారు.
ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేసుకున్నట్లయితే రోజుకు 0.3 టీఎంసీల నీటిని 90 రోజుల పాటు అందించవచ్చని వెల్లడించారు. శ్రీశైలం నుండి 824 అడు గుల నుండి ఎస్ఎల్బీసీ సొరంగ మార్గానికి నీరు వస్తుండగా, 840 అడుగుల నుంచి పోతిరెడ్డిపాడుకు నీరు చేరుతుందని మంత్రి చెప్పారు. ఎస్ ఎల్బీసీ పూర్తి అయితే అనధికారికంగా ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడుకు తరలించుకు పోయే అవకాశం ఉండదని స్పష్టం చేశారు.