అడెల్లి ఆలయంలో ప్లాస్టిక్ ఏరివేత
నిర్మల్,(విజయక్రాంతి): ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈరోజు శ్రీ ఎం.డి. నజీర్ ఖాన్, ఉప అటవీ క్షేత్రాధికారి, సారంగాపూర్ అధ్యక్షతన సారంగాపూర్ మండలంలోని అడెల్లీ నందనవనంలో ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా నందనవన పరిసరాల్లో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు మరియు ఇతర చెత్తాచెదారాన్ని తొలగించి పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు.
కార్యక్రమంలో ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఆదివారం అడెల్లి నందనవనానికి వేలాది మంది భక్తులు విచ్చేసి విందు, వినోద కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా స్టీల్ ప్లేట్ల వినియోగాన్ని ప్రోత్సహించే కార్యాచరణ చేపట్టాలని సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా హాజరైన పలువురు దాతలు స్టీల్ ప్లేట్లను విరాళంగా అందించేందుకు ముందుకు వచ్చారు. త్వరలో అడెల్లి నందనవనంలో ప్లాస్టిక్ ప్లేట్ల స్థానంలో స్టీల్ ప్లేట్ల వినియోగాన్ని అమలు చేయడానికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. "ప్లాస్టిక్కు వీడ్కోలు – పర్యావరణానికి చేయూత" అనే సందేశం విజయవంతమైనట్టు తెలిపారు.






