24-06-2025 01:45:41 AM
మరోసారి రికార్డు స్థాయిలో పలికిన ధర
ప్లాట్స్ విక్రయం ద్వారా రూ.65.02 కోట్ల ఆదాయం
హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): రాజధాని పరిసర ప్రాంతాల్లోని హౌసింగ్ బోర్డుకు చెందిన భూములు బహిరంగవేలంలో రికార్డు స్థాయి ధరలు పలికాయి. నగరంలోని గచ్చిబౌలి, చింతల్, నిజాంపేట తదితర ప్రాంతాల్లో వివిధ రకాల ప్లాట్లకు హౌజింగ్ బోర్డు అధికారులు సోమవారం బహిరంగ వేలం నిర్వహించారు. గచ్చిబౌలి ప్రాంతంలోని 3271 చదరపు అడుగుల భూముల్లోని ఒక కమర్షియల్ ప్లాట్ ఏకంగా రూ.33 కోట్లకు కొనుగోలు చేయడానికి ముందుకు రాగా, మరో చోట రూ.13.51 కోట్ల ధర పలికింది.
రెండు ఎంఐజీ ప్లాట్లను కూడా సుమారు రూ.4.50 కోట్లకు పైగా వెచ్చించి బహిరంగ వేలంలో దక్కించుకోవడానికి పోటీపడ్డారు. ఇక చింతల్ ప్రాంతంలోని 799.98 చదరపు గజాలు, నిజాంపేటలోని 1,653 చదరపు అడుగుల విస్తీర్ణంలోని మొత్తం 11 ప్లాట్లను వేలం వేయగా ప్రభుత్వానికి రూ.65.02 కోట్ల మేర ఆదాయం వచ్చిందని హౌజింగ్ బోర్డు వైస్ చైర్మన్, కమిషనర్ వీపీ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ కమ్యూనిటీ హల్లో నిర్వహించిన ఈ స్థలాల వేలం పాటలో 55 మంది పాల్గొన్నారని హౌజింగ్బోర్డ్ కమిషనర్ తెలిపారు.