01-12-2025 11:04:08 AM
దేశం కోసం పార్లమెంట్ ఏం చేస్తుందో.
భారత వృద్ధిని ప్రపంచం ప్రత్యక్షంగా చూసింది.
విపక్షాలు సహకరించాలి. చట్టసభల్లో డ్రామాలు వద్దు
వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య దేశంలో అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు ప్రధాని మీడియాతో మాట్లాడారు. తమ ప్రధాన లక్ష్యం దేశాభివృద్ధి మాత్రమే అన్నారు. చట్టసభల్లో సమయానికి చర్చలు తప్పనిసరన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. దేశ ప్రగతి కోసం పార్లమెంటులో మంచి చర్చలు కొనసాగాలని సూచించారు. దేశాభివృద్ధి కోసం విపక్షాలు మాతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. పరాజయం కూడా ఒప్పుకునే మనసు విపక్షానికి లేదని ఆరోపించిన నరేంద్ర మోదీ తాము మాత్రం విపక్షాలను కలుపుకుని ముందుకెళ్తామని పేర్కొన్నారు.
అన్ని అంశాలపై సానుకూలంగా చర్చలు జరుగుతాయిని ఆశిస్తున్నామని తెలిపారు. దేశ ప్రగతి కోసం మంచి సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రధాని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. కొత్త ఎంపీలకు స్ఫూర్తి కలిగించేలా మన ప్రవర్తన ఉండాలని కోరారు. చట్టసభల్లో డ్రామాలొద్దన్న ఆయన మంచి చర్చలు జరగాలని తెలిపారు. నినాదాలు చేస్తూ సభాకార్యక్రమాలకు అడ్డు తగలవద్దని కోరారు. జీఎస్టీ సంస్కరణల తర్వాత ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. "ఇటీవల బీహార్లో జరిగిన ఎన్నికలలో రికార్డు స్థాయిలో ఓటర్లు ఓటు వేయడం ప్రజాస్వామ్యానికి గొప్ప బలం. తల్లులు, సోదరీమణుల భాగస్వామ్యం పెరగడం వల్లే కొత్త ఆశ, కొత్త విశ్వాసం ఏర్పడుతోంది. ఒక వైపు, ప్రజాస్వామ్యం బలోపేతం కావడం, ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడాన్ని ప్రపంచం నిశితంగా గమనిస్తోంది. ప్రజాస్వామ్యం ఫలితాలను అందించగలదని భారతదేశం నిరూపించింది" అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.