28-06-2025 12:55:26 AM
విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: మానవహక్కుల వేదిక డిమాండ్
హైదరాబాద్, సిటీ బ్యూరో జూన్ 27 (విజయ క్రాంతి): మహిళా హక్కుల కార్యకర్త, ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ వీ సంధ్యపై పోలీసులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని, ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులైన పోలీసుల పై కఠిన చర్యలు తీసుకోవాలని మానవహక్కుల వేదిక డిమాండ్ చేసింది. పాలస్తీనాపై ఇజ్రాయిల్ చేస్తున్న మారణకాండకు అమెరికా ఇస్తున్న మద్దతును నిరసిస్తూ గత శుక్రవారం వామపక్ష, ప్రజా సంఘాలు తలపెట్టిన నిరసన కార్యక్రమంలో ఈ అమా నుష ఘటన జరిగింది.
ఈ ఘటనపై వాస్తవాలను తెలుసుకునేందుకు మానవహక్కుల వేదిక బృందం గాయపడిన సంధ్యను ఆమె నివాసంలో కలిసి వివరాలు సేకరించింది. నానక్రామ్గూడలోని అమెరికన్ కాన్సులేట్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపు తుండగా పోలీసులు తమపై దురుసుగా ప్రవర్తించారని సంధ్య మానవహక్కుల వేదిక బృందానికి వివరించారు. ‘నలుగురు మహిళా కానిస్టేబుళ్లు నా కాళ్లు, చేతులు పట్టుకొని గాల్లోకి లేపి వ్యాన్లో పడేశారు.
ఈ క్రమంలో నా కుడికాలిని ఓ కానిస్టేబుల్ ఆగ్రహంతో మెలితిప్పింది. నొప్పితో అరిచినా వినిపించుకోలేదు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని తగిన విధంగా శిక్షించాలని వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు ఎస్ జీవన్కుమార్, నగర అధ్యక్షుడు ఎం సురేశ్బాబు, సభ్యుడు వెంకట్ నారాయణ డిమాండ్ చేశారు.