11-06-2025 12:33:33 PM
హైదరాబాద్: ప్రముఖ తెలుగు మహిళా ఫోక్ సింగర్ మంగ్లీ(Female folk singer Mangli) పుట్టినరోజు వేడుక వివాదానికి దారితీసింది. మంగళవారం అర్ధరాత్రి నగర శివార్లలోని చేవెళ్ల త్రిపుర రిసార్ట్లో జరిగిన వేడుకలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో గంజాయి, విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నివేదికల ప్రకారం, ఈ పార్టీకి హాజరైన చాలా మంది అతిథులకు నిర్వహించిన డ్రగ్ పరీక్షలలో వారికి డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ పార్టీకి పెద్ద సంఖ్యలో సినిమా, రాజకీయ ప్రముఖులతో పాటు అనేక మంది యువత కూడా హాజరయ్యారు.
పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారని సమాచారం అందడంతో సైబరాబాద్ పోలీసులు(Cyberabad Police) రిసార్ట్ పై దాడి చేశారు. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో గంజాయి, వివిధ రకాల విదేశీ మద్యం సీసాలు బయటపడ్డాయి. ఆ పార్టీలో ఉన్న చాలా మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. కొన్ని నమూనాలలో డ్రగ్స్ పాజిటివ్ గా తేలినట్లు తెలిసింది. డ్రగ్స్ వాడిన వారిలో కొందరు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. పార్టీ నిర్వాహకుల పాత్రపై కూడా పోలీసులు దృష్టి సారించారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.