29-06-2025 08:35:36 PM
రోడ్డు పక్కన ఏర్పడిన గుంతల వలన ప్రమాదాలు..
ప్రమాదం అంచున ప్రయాణాలు అనే వార్తకు స్పందించిన పోలీసులు..
వేగం వద్దు ప్రాణం ముద్దు అన్న కన్నాయిగూడెం ఎస్సై వెంకటేష్..
కన్నాయిగూడెం (విజయక్రాంతి): కన్నాయిగూడెం మండలంలో తుపాకులగూడెం నుంచి ఏటూరునాగారం వరకు ఉన్న ప్రధాన రహదారి గుంతలు, బొంత పొదలు, పిచ్చి మొక్కలు ఎక్కువగా ఉన్నాయి.. అందువల్ల వాహనాదారులకు ఇబ్బందిగా మారింది.. కంతనపల్లి చెరువు వద్ద రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడింది.. అక్కడ చాలా ప్రమాదాలు జరిగాయి.. అలాంటి ప్రమాదాలు జరగకుండా చూసేందుకు కన్నాయిగూడెం ఎస్సై వెంకటేష్(SI Venkatesh) ఆ గుంతను టాక్టర్లతో మట్టి తెప్పించి పూడ్చారు. ప్రజల రక్షణ కోసం ప్రజలే దేవుళ్లు అన్న భావనకు నిజమైన అర్థం కన్నాయిగూడెం ఎస్సై వెంకటేష్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ... తుపాకులగూడెం నుంచి ఏటూరునాగారం వరకు ఉన్న ప్రధాన రహదారి గుంతలు పడి ప్రమాదాలకు అడ్డాగా మారింది. రోడ్డుపక్కన ఏర్పడిన గుంతల వలన ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురవుతుండగా ప్రజలు అసౌకర్యానికి లోనవుతుండగా ఆ గుంతను పూడ్చామని తెలిపారు.
ఆర్&బీ అధికారులు ఎవరూ పట్టించుకోకపోయో సరికి ఈ సమస్యను పోలీసు అధికారి ఎస్సై వెంకటేష్ స్వయంగా ఆ గుంత పూడ్చి పరిష్కారం వైపు అడుగులు వేశారు. తన స్వంత వ్యవస్థలో కార్మికులను సేకరించి, మట్టి, రాళ్లు సమకూర్చి, గంటల పాటు శ్రమించి రోడ్డుపక్క గుంతలను పూడ్చారు. నిత్యం ప్రజల రక్షణలో ఉండే పోలీసు అధికారి ఈ విధంగా నిత్యజీవితంలో సహాయకుడిగా మారడాన్ని గ్రామస్థులు మెచ్చుకున్నారు. సామాజిక బాధ్యతను వ్యక్తిగతంగా నెరవేర్చిన ఎస్సై వెంకటేష్ పై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. వాహనదారులు, పాదచారులు, స్థానిక ప్రజలు ఎస్సై సేవలపై ఆనందం వ్యక్తం చేస్తూ "ఇలాంటి అధికారులు మన గ్రామంలో ఉండటం అదృష్టం" అంటూ కొనియాడారు. అధికారులకే ఆదర్శంగా నిలుస్తున్న కన్నాయిగూడెం ఎస్సై చర్యలు అభినందనీయమని పలువురు గ్రామల పెద్దలు పేర్కొన్నారు.