28-10-2025 07:29:41 PM
వనపర్తి,(విజయక్రాంతి): వనపర్తి మండలం పెద్దగూడెం తండాకు విద్యుత్ సరఫరా కోసం లైన్ ఏర్పాటు చేసేందుకు త్వరతగతిన పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ తన చాంబర్లో పెద్దగూడెం తండాకు విద్యుత్ సరఫరా లైన్ ఏర్పాటు విషయంపై డీఎఫ్ఓ అరవింద్ ప్రసాద్ రెడ్డి తో కలిసి సంబంధిత అధికారులతో జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. వనపర్తి మండలం పెద్దగూడెం తండాకు విద్యుత్ సరఫరా కోసం లైన్ ఏర్పాటు చేసేందుకు అవసరమయ్యే స్థలం గురించి అధికారులు చేసిన సర్వే నివేదికను పరిశీలించారు. ఇందుకోసం మొత్తం 1526 మీటర్ల అటవీ భూమి అవసరం పడుతుందని సర్వే నివేదికలో పేర్కొనగా, ఇందుకు కమిటీ ఆమోదం తెలిపింది అని చెప్పారు. ఇక విద్యుత్ లైన్ వేసేందుకు కమిటీ నుంచి లైన్ క్లియర్ అయినట్లు చెప్పారు. ఇక వెంటనే పెద్దగూడెం తండాకు విద్యుత్ సరఫరా కోసం లైన్ ఏర్పాటు చేసేందుకు త్వరతగతిన పనులు ప్రారంభించాలని సూచించారు. అయితే లైను ఏర్పాటు చేసే సమయంలో విద్యుత్ అధికారులు అవసరం మేరకే ఒక పద్ధతి ప్రకారం కొమ్మలను తొలగించాలని కలెక్టర్ సూచించారు.
కొమ్మలను తొలగించే ముందు అటవీ అధికారులకు సమాచారం అందించాలని తెలియజేశారు. అదేవిధంగా, వనపర్తి మండలం పరిధిలోని సవాయిగూడెం గ్రామ చెరువుకు నీటి సరఫరా చేసేందుకు కాలువ నిర్మాణం గురించి నీటిపారుదల శాఖ అధికారులతో కలెక్టర్ ఆరా తీశారు. ఇందుకోసం కావాల్సిన అటవీ స్థలం గురించి పర్వేష్ పోర్టల్ లో నమోదు చేయాలని సూచించారు. వెంటనే సవాయిగూడెం చెరువుకు నీరు అందించేందుకు కాల్వ నిర్మాణం కోసం చర్యలు చేపట్టాలన్నారు. తద్వారా గ్రామంలో పంట అవసరాలకు సాగునీటిని అందించడం సులభతరం అవుతుందని తెలియజేశారు.