గ్రామాల అభివృద్ధికి ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక
ఎంపీడీఓ బద్రు నాయక్
మంగపేట, (విజయక్రాంతి): గ్రామాల్లో నెలకొన్న సమస్యలు అధికారులు పరిశీలించి పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం గ్రామాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని ములుగు జిల్లా మంగపేట ఎంపీడీఓ బి.బద్రు నాయక్ అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం భాగంగా ములుగు జిల్లా మంగపేట మండలంలోని 25 గ్రామ పంచాయతీలలో గురువారం గ్రామసభలు నిర్వహించారు. ఆయా గ్రామ సభలలో తెలంగాణ గీతాన్ని ఆలపించి అనంతరం ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను గ్రామసభలలో చదివి వినిపించారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై గ్రామసభల్లో విస్తృతంగా చర్చించారు.
గ్రామసభల్లో త్రాగునీరు, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, విద్య, వైద్య సదుపాయాలు, పింఛన్లు, గృహాల నిర్మాణం వంటి కీలక సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా గ్రామాల్లో మౌళిక వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పల్లెల అభివృద్ధికి అవసరమైన ప్రాధాన్యతా పనులను గుర్తించి వెంటనే అమలు చేయాలని గ్రామ సభల్లో అధికారులను ప్రజలు కోరారు. మండలంలోని కోమటిపల్లి గ్రామంలో జరిగిన గ్రామ సభకు ఎంపీడీఓ బి.బద్రు నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ బి.బద్రు నాయక్ మాట్లాడుతూ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక గ్రామ సభల ద్వారా ప్రజల అవసరాలు నేరుగా తెలుసుకుని అభివృద్ధి పనులను వేగవంతం చేయడం సాధ్యమవుతుందని తెలిపారు.
ప్రజల సమస్యలను నమోదు చేసి సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి, ప్రతి పథకం లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రామస్థులు కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. మండలంలో జరిగిన గ్రామ సభల సందర్భంగా ఎలాంటి ఆందోళనలు జరగకుండా మంగపేట ఎస్సై టీ.వీ.ఆర్.సూరి, రెండవ ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు తగిన బందోబస్తు నిర్వహించారు. మండల వ్యాప్తంగా జరిగిన గ్రామ సభల్లో తహసీల్దార్ తోట రవీందర్, ఎంపీడీఓ బి.బద్రు నాయక్, డిప్యూటీ తహసీల్దార్ జే.మల్లేశ్వర రావు, ట్రాన్స్ కో ఏఈ కృష్ణారావు , ఎన్ఆర్ఈజీఎస్ ఎపీఓ అంకూస్, మంగపేట ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అఖిల, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, గ్రామ ప్రత్యేక అధికారులు, సంబంధిత విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




