29-05-2025 03:18:58 AM
- దుక్కులు దున్నుతున్న రైతులు
- పలు చోట్ల విత్తనాలు నాటుతున్న అన్నదాతలు
- ముందుగానే నైరుతి రుతుపవనాల రాకతో సంతోషం
నిర్మల్, మే 28 (విజయక్రాంతి): అల్పపీడన ప్రభావంతో నైరుతి రుతుపవనాలు ముందుగానే రావడంతో రాష్ట్రంలో వానలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏరువాక సాగుకు సన్నద్ధమవుతున్నారు. దుక్కులు దున్ని విత్తనాలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. పలుచోట్ల విత్తనాలు నాటుతున్నారు.
నిర్మల్ జిల్లాలో కురిసిన వర్షాల నేపథ్యంలో రైతులు సాగు పనులకు శ్రీకారం చుట్టారు. గత వారం రోజులుగా వర్షాలు కురవడంతో వేసవి దుక్కులను దున్నుకున్న రైతులు పత్తి విత్తనాలు నాటుతున్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 4.50 లక్షల ఎకరాల పంట సాగు అవుతున్నట్టు అధికారులు అంచనావేయగా.. ఇందులో 2.70 లక్షల ఎకరాల్లో పత్తి ప్రధానంగా రైతులు సాగు చేస్తారని భావిస్తున్నారు.
ఏటా మృగశిర కార్తె తర్వాత వర్షాలు కురిస్తే విత్తనాలు విత్తుకునే రైతులు.. ఈసారి పది రోజుల ముందుగానే వర్షాలు కురవడంతో కుంటాల, దిల్వార్పూర్, నర్సాపూర్, లోకేశ్వరం మండలాల్లో పత్తి విత్తనాలు నాటుతున్నారు.