రాష్ట్రపతికి వీడ్కోలు
హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) శీతాకాల విడిది నేటితో ముగియనుంది. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు హకీంపేట విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి ఢిల్లీకి పయనం కానున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రపతి ముర్ముకు వీడ్కోలు పలకనున్నారు. ఇందుకు సంబంధించి అధికారలు ఏర్పాట్లు పూర్తి చేశారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో(Telangana Governor Jishnu Dev Varma) కలిసి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. బొల్లారం రాష్ట్రపతి నిలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, పలువురు మంత్రులు, న్యాయమూర్తులు, పలువురు పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నగర ప్రముఖులు, త్రివిధ దళాలకు చెందిన అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.




