07-12-2025 09:29:59 AM
గోవా: గోవాలోని అర్పోరా గ్రామంలోని ఓ ప్రముఖ నైట్ క్లబ్లో ఘోర అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటన తనకు బాధ కలిగించిందని ద్రౌపది ముర్ము అన్నారు. మృతుల కుటుంబాలకు ఆమె తన సానుభూతిని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు భగవంతుడు బలాన్ని చేకుర్చాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని తను ప్రార్థిస్తున్నానని ఆమె ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఈ సంఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా విచారం వ్యక్తం చేశారు. గోవా అగ్నిప్రమాదం గురించి వివరాలను గోవా సీఎం సావంత్కు ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రానికి, బాధిత ప్రజలకు కేంద్రం అవసరమైన అన్ని సహాయం అందిస్తుందని ఆయన ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. మరణించిన ప్రతి ఒక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్గ్రేషియాను కూడా ప్రధాని ప్రకటించారు. గాయపడినవారు వీలైనంత త్వరగా కోలుకోవాలని తను ప్రార్థిస్తున్నానని ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
గోవాలోని అర్పోరా గ్రామంలోని ఓ ప్రముఖ నైట్ క్లబ్లో శనివారం ఘోర అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.. ఈ ప్రమాదంలో దాదాపు 25 మంది మృతి చెందగా, మరికొంత మంది గాయపడినట్లు సమాచారం. ఈ అగ్నిప్రమాదానికి సిలిండర్ పేలడమే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. త్వరలోనే పూర్తి స్థాయి విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నైట్ క్లబ్కు అనుమతి ఇచ్చిన అధికారులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.