కోదాడ హైవేపై లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
ఆరుగురికి గాయాలు
కోదాడ మే 24: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని జాతీయ రహదారి65పై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్న యోలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉండగా ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజామున వేళల్లో డ్రైవర్ అలసటకు గురై నియంత్రణ కోల్పోవడంతో బస్సు లారీని ఢీకొట్టిందని వారు తెలిపారు. కోదాడ టౌన్ సీఐ శివశంకర్ నాయక్ తన సిబ్బందితో వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని 108 అంబులెన్స్ ద్వారా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






