వీబీ జీ రాంజీపై కేంద్రానికి నిరసన లేఖ
- కొత్త విధానంపై క్యాబినెట్లో చర్చించాక తుది నిర్ణయం
- పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి అమలు చేయాలని ప్రతిపాదించిన వీబీ జీ రాంజీ స్కీంపై తెలంగాణ ప్రభుత్వం తన నిరసనను అధికారికంగా తెలియజే యాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. వీబీ జీ రాంజీ స్కీంను వ్యతిరేకిస్తూ తెలంగాణ శాసనసభ ఇప్పటికే తీర్మానం చేసిన విష యం తెలిసిందే.
జూలై 1 నుంచి కొత్త విధానాన్ని అమలు చేయాలంటూ కేంద్రం రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను, అభ్యంతరాలను కేంద్రానికి తెలియజేయాలని నిర్ణయించారు. అనుగుణంగా నిరసన లేఖను రాయనున్నట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు. లేఖలో పొందుపరచాల్సిన అంశాలపై మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో మంత్రి సీతక్క శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకానికి అవసరమైన నిధుల్లో కనీసం 60 శాతం కేంద్రం నుంచి అందాలంటే కొత్త విధానాన్ని అమలు చేయక తప్పదని అధికారులు సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... డిమాండ్ ఆధారంగా కాకుండా నార్మేటివ్ విధానంలో పనిదినాల కేటాయింపును ప్రతిపాదించడం సరికాదన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిషోర్, కమిషనర్ దివ్య దేవరాజన్, స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మి, జాయింట్ కమిషనర్ నరసింహులు తదితర అధికారులు పాల్గొన్నారు.






