05-05-2024 12:05:00 AM
బీజేపీ నేత దినేశ్ ప్రతాప్సింగ్ విమర్శలు
లక్నో, మే 4: ఉత్తరప్రదేశ్లోని అమేథీలో కాంగ్రెస్ అభ్యర్థిగా కిశోరీలాల్ శర్మను పోటీలోకి దింపటంపై బీజేపీ నేత దినేశ్ ప్రతాప్సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ తన గుమాస్తా (ప్యూన్)ను అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై పోటీకి దింపి రాయ్బరేలీకి పారిపోయారని ఎద్దేవా చేశారు. ‘రాహుల్గాంధీ నిజంగా రాయ్బరేలీ, అమేథీలో గెలువాలని కోరుకొంటున్నారా? అమేథీలో కాంగ్రెస్ నిజంగా గెలువాలని భావిస్తే రాహుల్గాంధీ గుమాస్తాకు అక్కడ టికెట్ ఎందుకు ఇచ్చారు? ఈ రెండుచోట్లా కాంగ్రెస్ ఓడిపోబోతున్నది. అమేథీ నుంచి రాహుల్ పారిపోయారు. ఆయన అక్కడ ఓట్లు అడగరనే భావిస్తున్నాను. ఎందుకంటే అక్కడ అమేథీ ప్రజల కుటుంబసభ్యురాలి వంటి స్మృతి ఇరానీ ఉన్నారు. అమేథీ ఆమెను ఎంతో ప్రేమగా చూస్తుంది. గొప్పగా గౌరవిస్తుంది’ అని పేర్కొన్నారు. రాయ్బరేలీలో రాహుల్ పై దినేశ్ప్రతాప్ సింగ్ పోటీ చేస్తున్నారు.