20-08-2025 02:28:26 PM
జయంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణుల నివాళ్ళు...
అదిలాబాద్ (విజయక్రాంతి): మాజీ ప్రధానమంత్రి, దివంగత రాజీవ్ గాంధీ పార్టీ కోసం చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి అన్నారు. బుధవారం ఆదిలాబాద్ లోని ప్రజాసేవ భవన్ లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలను కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి రాజీవ్ గాంధీ అమరహై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రూపేష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో భారత రత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ ఎన్నో సంస్కరణలు ప్రవేశ పెట్టి దేశాన్ని ప్రగతి పథంలో పయనింప చేసారని అన్నారు.
దేశంలో టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్ రంగాలను ప్రవేశపెట్టి సాంకేతిక, సమాచార విప్లవ పితామహుడిగా పేరు గడించారని ఆయన సేవలను కొనియాడారు. మహిళలకు 33% రిజర్వేషన్లు, యువతకు 18 యేళ్లకు ఓటు హక్కు కల్పించిన మహానుభావుడు రాజీవ్ గాంధీ యేనని తెలిపారు. వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త నడుచుకోవాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ దిగంబరావ్ పాటిల్, పార్టీ పట్టణ అధ్యక్షులు గుడిపల్లి నగేష్, సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ రావు, జాఫర్ అహ్మద్, శ్రీ లేఖ, అలం రూప తదితరులు ఉన్నారు.