14-01-2026 02:03:47 AM
గ్రామాభివృద్ధే ధ్యేయమన్న రమేష్ యాదవ్
షాద్నగర్, జనవరి 13 (విజయక్రాంతి): తల్లిదండ్రుల జ్ఞాపకార్థం జన్మభూమికి సేవ చేయడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ పేర్కొన్నారు. షాద్నగర్ మున్సిపాలిటీలోని 5వ వార్డు సోలిపూర్ గ్రామ బిఆర్ఎస్ అధ్యక్షుడు చీపిరి రమేష్ యాదవ్, తన తండ్రి దివంగత చీపిరి అంజయ్య యాదవ్ జ్ఞాపకార్థం గ్రామానికి విరాళంగా అందజేసిన ‘స్వాగత తోరణాన్ని’ మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాను పుట్టి పెరిగిన గ్రామంపై ఉన్న మమకారంతో రమేష్ యాదవ్ చేసిన ఈ ఏర్పాటు సోలిపూర్ గ్రామానికి కొత్త హంగులను తీసుకువచ్చిందని కొనియాడారు.
ఇలాంటి సేవా కార్యక్రమాలు యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దాత చీపిరి రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా, గ్రామానికి ఏదైనా శాశ్వత గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో ఈ తోరణాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో 5వ వార్డు సోలిపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ కొందూటి నరేందర్, మాజీ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, నాయకులు వెంకటేష్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, మునురు నరేందర్, పొచమోని నందు యాదవ్, చెందర్ నాయక్, నర్సింలు యాదవ్, వివిధ విభాగాల నాయకులు, భారీసంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.