14-01-2026 02:02:00 AM
ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, జనవరి 13(విజయక్రాంతి):పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మరల్చడానికి రేవంత్ ప్రభుత్వం తరచూ చేసే అటెన్షన్ డైవర్షన్ డ్రామాలేనని, విచారణల పేరిట కమిషన్లు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముల (సిట్) ఏర్పాటు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మహిళా ఐఏఎస్ను కించపరుస్తూ వార్తలను ప్రచారం, సీఎం రేవంత్రెడ్డి ఫోటోలు అసభ్యకరంగా పోస్ట్ చేసిన వ్యవహారానికి సంబంధించిన కేసులపై డీజీపీ సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కేటీఆర్ ఎక్స్ వేదికగా మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ సర్కారులో రాష్ర్ట మంత్రుల పీఏలు, మంత్రి కొడుకు, ఏఐసీసీ సెక్రటరీపై ఆరోపణలు వస్తే వాటిపై ఎలాంటి సిట్లు లేవని కానీ, మీ అంతర్గత కుమ్ములాటల్లో భాగంగా అధికార పక్షానికి దగ్గరగా ఉండే టీవీ చానెల్ రాష్ర్ట మంత్రి మీద వేసిన వార్తా కథనాన్ని కేవలం ‘ఉటంకించినందుకు’ అనేక ఛానెళ్ల మీద, డిజిటల్ మీడియా హ్యాండిళ్ల మీద దర్యాప్తు చేయడానికి ఏకంగా సిట్ ఏర్పాటు చేశారని కేటీఆర్ దుయ్యబట్టారు. వార్త వేసిన ఛానెల్ మీద చర్యలు తీసుకుకంటే సరిపోతుందు కదా..? అని ఆయన నిలదీశారు. ప్రజలు మీ ఓవరాక్షన్ గమనిస్తున్నారని మీకు తగిన గుణపాఠం చెప్పుడు ఖాయమని హెచ్చరించారు.