28-11-2025 11:47:51 PM
నిజామాబాద్, నవంబర్ 28 (విజయ క్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సమక్షంలో శుక్రవారం నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీ.సీ హాల్ లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ జరిపించారు.
ఈ ప్రక్రియను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. జిల్లాలోని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ రెవెన్యూ డివిజన్లలోని ఒక్కో మండలం వారీగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓ.పీ.ఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని, ర్యాండమైజేషన్ ద్వారా స్థానికేతర సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేశారు.
జిల్లాలోని 545 గ్రామ పంచాయతీల సర్పంచ్, 5022 వార్డు స్థానాలకు ఎన్నికల నిర్వహణ కోసం 20 శాతం రిజర్వ్ స్టాఫ్ కలుపుకుని ప్రిసైడింగ్ అధికారులు, ఓ.పీ.ఓల ర్యాండమైజేషన్ జరిపారు. ర్యాండమైజేషన్ ప్రక్రియలో అదనపు కలెక్టర్ అంకిత్, డీపీఓ శ్రీనివాస్ రావు, నోడల్ అధికారి పవన్ కుమార్ పాల్గొన్నారు.