30-05-2025 11:23:09 PM
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగ బాధ్యతలు సమర్థంగా నిర్వహించి ప్రజలకు సేవలు అందించినప్పుడు ప్రజల జీవితాల్లో స్థిరంగా ఉంటారని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా రోడ్లు భవనాల శాఖ ఈ అశోక్ కుమార్ పంచాయత్ రాజ్ ఈ శంకరయ్య తోపాటు పలుగురు ఉద్యోగులు పదవీరమైన చేయగా వారిని ప్రత్యేకంగా అభినందించారు. నిర్మల్ జిల్లాలో సుదీర్ఘకాలం పనిచేసి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చిన అధికారులు విరమణ చేయడం బాధ కలిగించినప్పటికీ వృత్తి ధర్మం పాటించినందుకు సంతోషంగా ఉందన్నారు.
ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీవిరమణ ఒక సహజమైన ఘట్టమని, అయితే వారు అందించిన సేవలు మాత్రం ప్రజల మనసుల్లో నిలిచిపోతాయని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా అభివృద్ధిలో అశోక్ కుమార్ ముఖ్య భూమిక పోషించారని, జిల్లా కొత్త కలెక్టరేట్ భవనం నిర్మాణంలో కీలక పాత్ర పోషించినట్టు గుర్తుచేశారు. అలాగే జిల్లాలో నిర్వహించిన వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు వేదికలు సిద్ధం చేయడం, నిర్మల్ ఉత్సవాల విజయవంతానికి చేయూతనివ్వడం ప్రశంసనీయమన్నారు. భావి జీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా అధికారులు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ, అశోక్ కుమార్ గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన సేవల్ని స్మరించుకుంటూ శేష జీవితం ఆరోగ్యంగా సాగాలని కోరారు. కార్యక్రమంలో బదిలీపై వెళ్లిన పంచాయతీ రాజ్ శాఖ ఈఈ శంకరయ్యను కూడా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఇతర అధికారులు శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, జెడ్పీ సీఈవో గోవింద్, సిపిఓ జీవరత్నం, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.