04-08-2024 02:01:47 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 3: దేశంలో ప్రీమియం స్మార్ట్ఫోన్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఐఫోన్ తయారీ కంపెనీ యాపిల్ రికార్డు ఆదాయాన్ని ఆర్జించింది. భారత్తో సహా 24 దేశాల్లో 2024 జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో రికార్డు ఆదాయాన్ని నమోదుచేసినట్టు యాపిల్ సీఈవో టిమ్కుక్ తెలిపారు. జూన్ క్వార్టర్లో యాపిల్ నికర లాభం 7.8 శాతం వృద్ధిచెంది 19.8 బిలియన్ డాలర్ల నుంచి 21.44 బిలియన్ డాలర్లకు పెరిగింది. కంపెనీ నికర అమ్మకాల ఆదాయం 81.79 బిలియన్ డాలర్ల నుంచి 85.77 బిలియన్ డాలర్లకు చేరింది. ఆదాయం తమ అంచనాల్ని మించిందని, ఇండియా, కెనడా, మెక్సికో, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్లాండ్ దేశాల్లో రికార్డుస్థాయిలో త్రైమాసిక ఆదాయాన్ని ఆర్జించినట్టు కుక్ వివరించారు.
భారత్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్లాండ్లతో కూడిన రెస్ట్ ఆఫ్ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో యాపిల్ 760 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసినట్టు తెలిపారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ అమ్మకాలు 39.66 బిలియన్ డాలర్ల నుంచి స్వల్పంగా 39.29 బిలియన్ డాలర్లకు తగ్గాయి. యాపిల్ మ్యాక్ అమ్మకాలు 2.4 శాతం వృద్ధితో 7 బిలియన్ డాలర్లకు, ఐప్యాడ్ అమ్మకాలు 24 శాతం వృద్ధితో 7.16 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఎం3 చిప్తో పనిచేసే మ్యాక్బుక్ ఎయిర్ నేతృత్వంలో మ్యాక్ అమ్మకాలు లాటిన్ అమెరికా, ఇండియా, దక్షిణాసియాలో రికార్డుస్థాయిలో జరిగాయని యాపిల్ తెలిపింది. వేరబుల్స్,యాక్సెసరీస్ అమ్మకాలు 2 శాతం తగ్గి 8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.