30-06-2025 02:21:23 AM
తుర్కయంజాల్, జూన్ 29:కమ్యూనిస్టులది ప్రజల సిద్ధాంతమని, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడటమే కమ్యూనిస్టుల లక్ష్యమని సీపీఐ రాష్ట్ర నాయకుడు ఓరుగంటి యాదయ్య అన్నారు. ఆ పార్టీ జిల్లా సమితి సభ్యులు పి.శివకుమార్ అధ్యక్షతన తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి రాగన్నగూడ శాఖ మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హా జరైన యాదయ్య మాట్లాడుతూ ప్రజల కష్టాల్లో ఉన్న చోట ఎర్రజెండా ఉంటుందన్నారు.
దే శంలో ప్రజలు తీవ్రమైన ఆర్థిక అసమానతలతో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక సమానత్వాన్ని సాధించకుండా దేశం ముందుకు పోజాలదన్నారు. ఇక రాగన్నగూడ పరిధిలో డ్రైనేజీ, మంచినీరు, రోడ్డు సమస్యలు ఉన్నాయని, వాటిని తక్షణమే పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రజలతో మమేకమై పనిచేయాలని అన్నారు. అనంతరం సీపీఐ రాగన్నగూడ శాఖను ఎన్నుకున్నారు.
నూతన కార్యదర్శిగా పల్లపు శివకుమార్, సహాయ కార్యదర్శులుగా శ్రీకాంత్, లోకేష్ తో పాటు 9 మందిని కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమాలో నాయకులు జనార్ధన్, శ్రీనివాస్ గౌడ్, కొండిగారి శివకుమార్, శ్రీకాంత్, గోవర్ధన్, లోకేష్, పృథ్వీ, వంశీ, నాగేశ్వర్, దేవా నాయక్ తదితరులు పాల్గొన్నారు.