బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ విడుదల
16 రోజులుగా కంది జైలులో ఉన్న క్రిశాంక్
సంగారెడ్డి, మే 9(విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలు నుండి శనివారం విడుదలయ్యారు. గత 16 రోజులుగా వివిధ కేసుల్లో జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా క్రిశాంక్ మీడియాతో మాట్లాడుతూ తనపై 34 కేసులను కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందని తెలిపారు. తనకు నేర చరిత్ర ఉందని అబద్ధాలను దుష్ప్రచారం చేస్తోందని, తాను తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినట్లు తెలిపారు.
అంగన్వాడీలకు ఇచ్చే ఫోన్లలో అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని, యూనివర్శిటీలో చెట్ల నరికివేతపై నిలదీసినందుకే అక్రమ కేసులు బనాయించారన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు మానుకోవాలని, తాను ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం సాగిస్తానని, కేసీఆర్ శిష్యుడిగా ఆయన అడుగుజాడల్లో నడుస్తానని క్రిశాంక్ తెలిపారు.






