వాహనదారులకు ఊరట
- ఇంధన ధరలు తగ్గించిన ‘నయారా’
- పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.3 చొప్పున తగ్గింపు
- కంపెనీ సవరించిన రేట్లు అమల్లోకి
- దేశవ్యాప్తంగా 7వేలకు పైగా బంకుల్లో అమలు
న్యూఢిల్లీ, జూలై 1: కొంతకాలంగా పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) ఉద్రిక్తతలతో అల్లాడిపోతున్న ఇంధన వినియోగదారులకు ఊరట లభించింది. ఇరాన్ వివాదం సడలడం, కీలకమైన సముద్ర రవాణా మార్గాలు తెరుచుకోవడంతో అంతర్జాతీయంగా ముడిచమురు, ద్రవీకత సహజ వాయువు (ఎల్ఎన్జీ) సరఫరాలు మళ్లీ గాడిలో పడ్డాయి. దీంతో ప్రపంచవ్యాపంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. తగ్గిన ముడిచమురు ధరల ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తూ భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రంగ ఇంధన రిటైలర్ నయారా ఎనర్జీ సంచలన నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా ఉన్న తమ రిటైల్ నెట్వర్క్లో బుధవారం పెట్రోల్ ధరను లీటరుకు రూ.5, డీజిల్ ధరను లీటరుకు రూ.3 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత ఇంధన ధరలను తగ్గించిన మొదటి రిటైలర్గా నయారా నిలిచింది. దేశవ్యాప్తంగా నయారాకు చెందిన 7,000 ఇంధన స్టేషన్లలో సవరించిన ధరలు తక్షణమే అమలులోకి వచ్చాయి. నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి ఇది నిజంగా పెద్ద రిలీఫ్.
కొత్త రేట్ల ప్రకారం..
కొత్త రేట్ల ప్రకారం.. నయారా బంకుల్లో లీటర్ పెట్రోల్పై రూ.5, అలాగే లీటర్ డీజిల్పై రూ.3 చొప్పున తగ్గించారు. ఈ తగ్గింపు తర్వాత బెంగళూరులో లీటరు పెట్రోల్ రూ.111.20, డీజిల్ రూ.98.80కి చేరింది. అటు మహారాష్ట్రలో లీటర్ పెట్రోల్ రూ.111.66, డీజిల్ రూ.97.99 కాగా.. ఫరీదాబాద్లో పెట్రోల్ రూ.103, డీజిల్ రూ.98.84 కి తగ్గాయి. స్థానిక రవాణా ఖర్చులు, వ్యాట్ ఆధారంగా జిల్లాల వారీగా ఈ ధరల్లో కొన్ని పైసల వ్యత్యాసం ఉండనుంది.






