18 April, 2026 | 3:49 PM

సిద్ధరామయ్యకు హైకోర్టులో ఊరట

20-08-2024 03:01 AM
  1. ముడా స్కామ్ కేసులో తక్షణ చర్యలు తీసుకోవద్దని ట్రయల్ కోర్టుకు ఆదేశం 
  2. ఆగస్టు 29న తదుపరి విచారణ

బెంగుళూరు, ఆగస్టు 19: ముడా స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. ముడా స్కామ్‌కు సంబంధించి తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరు చేయడాన్ని సీఎం హైకోర్టులో సవాల్ చేయగా.. ఆయనపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోవద్దని ట్రయల్ కోర్టును.. హైకోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 29న చేపడతామని స్పష్టం చేసింది. 

నా జీవితం తెరిచిన పుస్తకం..

తనపై వస్తున్న ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య కొట్టిపారేశారు. ‘నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. ఇప్పటివరకు ఎలాంటి తప్పు చేయలేదు. భవిష్యత్‌లోనూ చేయను. విపక్ష బీజేపీ, జేడీఎస్‌లు నాపై కావలనే కుట్రపన్ని కోర్టులో కేసులు వేశా యి. ఆగస్టు 17, 1984లో తొలిసారి మంత్రి పదవి చేపట్టాను. అప్పటి నుంచి ఇప్పటివరకు నా రాజకీయ జీవితంలో ఒక్క మరక కూడా లేదు. మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ మాదిరిగా కర్ణాటకలోనూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఎన్డీఏ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. నాపై వచ్చిన ఆరోపణలపై న్యాయ పోరాటం చేస్తాను’ అని స్పష్టం చేశారు. ముడా స్కాంలో ఆరోపణల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేయాలని విపక్షాల డిమాండ్‌ను సిద్ధూ తోసిపుచ్చారు.