12-11-2025 12:00:00 AM
ప్రభుత్వ స్థలంలో ఏర్పాటుకు హామీ
తూప్రాన్, నవంబర్ 11 : తూప్రాన్ పట్టణంలోని ప్రధాన రహదారిపై ఫుట్ పాత్, రోడ్డును ఆక్రమించి నిర్మించిన దుకాణాలను మున్సిపల్ అధికారులు తొలగించారు. అక్రమ దుకాణాల వల్ల వినియోగదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి, ఎస్త్స్ర శివానందం, ఎస్త్స్ర యాదగిరి మంగళవారం తొలగించారు.
తూప్రాన్ పట్టణ ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని వాహనదారులకు, బాటసారులకు, విద్యార్టులను తీవ్ర ఆటంకాలు ఏర్పడడంతో దుకాణ సముదాయాలను తొలగించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా చిరు వ్యాపారాలైన బట్టల సముదాయాలు, పండ్ల దుకాణాలు, పువ్వుల దుకాణాలు, చెప్పుల దుకాణాలు, గప్ చుప్ దుకాణాలు అడ్డగోలుగా ఒకరిని మించి మరొకరు ప్రధాన రోడ్డును, ఫుట్ పాత్ ను ఆక్రమించుకొని వ్యాపారాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. ఇక మీదట ఎవరైనా సరే నిబంధనలను బేఖాతర్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తామన్నారు.
వ్యాపారస్తులకు వేరేచోట కేటాయింపు...
ఫుట్పాత్ వ్యాపారస్తులకు పాత మున్సిపల్ కార్యాలయం వెనుక భాగంలో పలువురికి చోటు కల్పిస్తామని, మిగతా వ్యాపారస్తులకు పోచమ్మ దేవాలయం ఖాళీ స్థలంలో, ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉంటే అక్కడ దుకాణం సముదాయాలకు స్థలాన్ని కేటాయిస్తామని మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి హామీ ఇచ్చారు.