దమ్ముంటే రాజీనామా చెయ్!
జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 18 :మంత్రి పదవి రాకపోతే రాజీనామా చేస్తానన్న ఎమ్మెల్యే రంగారెడ్డిని దమ్ముంటే రాజీనామా చేయాలని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధి శేరిగూడలోని సీ.కే కన్వెన్షన్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రంగారెడ్డి నియోజకవర్గ ప్రజల అభివృద్ధిని, సమస్యలను గాలికి వదిలేసి, మంత్రి పదవి కోసం తిరుగుతూ కాలం గడుపుతున్నారని ఆయన మండిపడ్డారు. సంవత్సరంనర కాలంగా నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా శూన్యమని విమర్శించారు. గత ప్రభుత్వంలో చేసిన శంకుస్థాపనలనే మళ్లీ మళ్లీ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవ చేశారు.
ప్రజా క్షేత్రంలో పదవులు శాశ్వతం కావనీ, ప్రజల కోసం చేసే సేవే శాశ్వతమనీ ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 27న వరంగల్ లో జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేసేందుకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశమై, జన సమీకరణ, వివిధ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి, క్యామ మల్లేష్, పంది కృపేష్, సిహెచ్ బుగ్గ రాములు, ఆకుల యాదగిరి, కొప్పు జంగయ్య తదితరులు పాల్గొన్నారు.






