ఆలయ అభివృద్ధికి కృషి..
రూ.50 వేలతో క్యూలైన్ ఏర్పాటుకు విరాళం అందజేసిన రిటైర్డ్ ప్రిన్సిపాల్
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మండల కేంద్రం అర్వపల్లిలోని శ్రీ యోగానంద లక్ష్మీ నర్సింహాస్వామి దేవాలయానికి మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ డైట్ ప్రిన్సిపాల్ కొణతం శ్రీనివాసరెడ్డి దంపతులు వారి మనవండ్ల పేరుమీద ఆలయ చైర్మన్ అనిరెడ్డి రాజేందర్ రెడ్డి ప్రోత్సాహంతో సోమవారం రూ. 50 వేల విలువ చేసే క్యూ లైన్ నిర్మాణ ఏర్పాటుకు విరాళం అందించారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు జరిపారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దంపతులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. త్వరలో జరగనున్న స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహాయ సహకారాలు అందించి ఆలయ పూర్వ వైభవానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అనిరెడ్డి రాజేందర్ రెడ్డి, అర్చకులు రాంబాబు అయ్యంగార్, పవనాచార్యులు తదితరులు పాల్గొన్నారు.






