నీట్ అక్రమాల్లో రేవంత్ హస్తం
సీఎంపై బీఆర్ఎస్వీ ఆరోపణ
హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): నీట్ పరీక్షల అక్రమాల్లో సీఎం రేవంత్రెడ్డి హస్తం ఉందనే అనుమానం కలుగుతుందని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. మంగళవారం నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి నిరసనగా విద్యార్థి నాయకులతో కలిసి రాజ్భవన్ ముట్టడించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో వారిని పోలీసులు అరెస్టు చేసి ఎస్ఆర్నగర్ పీఎస్కు తరలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం వెంటనే నీట్ పరీక్ష రద్దు చేయాలని, దీనిపై కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డి స్పందించకపోతే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. సీఎం స్పందించకపోతే వారి కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. విద్యార్థుల భవిష్యత్తుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని, గవర్నర్ చొరవ తీసుకుని ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.






