ధాన్యం కొనుగోలు చేయాలని రాస్తారోకో
04-06-2026 01:45 AM
గజ్వేల్, జూన్ 3(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లి, వీరనగర్ గ్రామాలకు చెందిన రైతులు బుధవారం గజ్వేల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ధాన్యాన్ని రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ సుమారు 50 శాతం వరి ధాన్యం కొనుగోలు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు తెలిపారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందని, అధికారులు వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో కొంతసేపు రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరారు.






