30-09-2025 01:46:13 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమ టి రెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. ఫ్లడ్ డ్యామేజ్ రోడ్ల వివరాలు, పలు పనుల పురోగతిపై సోమవారం మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 1062 ప్రాంతాల్లో 1370 కి.మీ మేర స్టేట్ రోడ్స్ దెబ్బతిన్నాయని, 68 రోడ్లు కోతకు గురికాగా, 38 తాత్కాలిక పునరుద్ధరణ చేసినట్టు మంత్రికు ఈఎన్సి మోహన్ నాయక్ వివరించారు.
445 చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడితే, 375 చోట్ల పునరుద్ధరణ పనులు పూర్తి చేసినట్టు తెలిపారు. సుమారు 306 కోట్ల సిడి వర్క్స్ దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఈమేరకు తాత్కాలిక, శాశ్వత పునరుద్ధరణ కోసం అంచానాలు రూపొందించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ప్రాథమిక అంచనా ప్రకారం తాత్కాలిక పునరుద్ధరణ కోసం 72.49 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు 1263.33 కోట్లు అవుతాయని అధికారులు మంత్రికి వివరించారు.
వర్షాలు తగ్గుముఖం పట్టగానే పూర్తి స్థాయి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని, శాశ్వత పునరుద్ధరణ కోసం మళ్లీ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలని ఈఎన్సీ మోహన్ నాయక్ను మంత్రి ఆదేశించారు. అలాగే టిమ్స్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల పనులు వేగం పెంచి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తుది దశకు చేరుకున్న ములుగు, వరంగల్, కరీంనగర్ జిల్లాల కలెక్టరేట్లు నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు.
నారాయణపేట, ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ల పనుల్లో వేగం పెం చాలని, ఆర్ అండ్ బి పరిధిలో నిర్మితమవుతున్న ప్రతి భవన నిర్మాణాలు ప్రభు త్వం విధించిన నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు. నేషనల్ హైవేలు, పురోగతిలో ఉన్న ఫ్లు ఓవర్లుపై ఆరా తీసిన మంత్రి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని చెప్పారు. ఎన్నికల కోడ్ తర్వాత పూర్తి స్థాయి లో సమీక్ష నిర్వహిస్తానని, ముఖ్యమంత్రితో మాట్లాడి హ్యామ్ రోడ్లపై ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకువస్తామని మంత్రి తెలిపారు.