29 April, 2026 | 2:29 AM

వడ్ల లోడుతో వెళ్తున్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

29-04-2026 01:28 AM

15 మంది ప్రయాణికులకు గాయాలు

డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం

కొల్చారం, ఏప్రిల్ 28: ముందు వెళ్తున్న వడ్ల లోడు లారీని వెనుక వైపు నుండి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది ప్రయాణికులు గాయాల పాలైన సంఘటన మంగళవారం మధ్యాహ్నం మండల కేంద్రమైన కొల్చారం లో మూతపడిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు వద్ద జరిగింది.

బోధన్ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు సికింద్రాబాద్ నుండి బోధన్ వెళుతుండగా మార్గమధ్యలో కొల్చారం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు సమీపంలో ఎదురుగా వెళ్తున్న వడ్లల్లోడు లారీని వెనకవైపునుండి కొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న మెదక్ ఎల్లారెడ్డి బోధన్ ప్రాంతాలకు చెందిన 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.

వీరిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. నాలుగు 108 వాహనాల సహాయంతో క్షతగాత్రులను మెదక్ జిల్లా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం పంపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కొల్చారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ బస్సులో కండక్టర్ లేకపోవడం ఆ డ్రైవర్ కండక్టర్ గా డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తూ బస్సును అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు.