అమరులైన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కు ఘన నివాళులు
బాన్సువాడ లో మానవహారం నిర్వహించిన ఆర్టీసీ జేఏసీ
బాన్సువాడ,(విజయక్రాంతి): రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్టీసీ డిపోలో ఉద్యోగులు డిపో గేటు వద్ద అమరులైన శంకర్ గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా బయలుదేరి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాన్సువాడ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ మల్లయ్య వైస్ చైర్మన్ మారుతి మాట్లాడుతూ... ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల మనోభావాలను దెబ్బతీయకుండా డిమాండ్లను వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని వారు పేర్కొన్నారు. అనంతరం ఉద్యోగులందరూ మూతికి నల్ల బట్ట కట్టి మౌనం పాటించారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ సలహాదారులు గిరిధర్ , కో- కన్వీనర్ లక్ష్మన్ , మజీద్, చింతల్ రాములు , రాధ , సవిత , ఇందిరా,ఇతర జేఏసీ సభ్యులు పాల్గొన్నారు.






