2 June, 2026 | 8:30 PM

ఇసుక ట్రాక్టర్లు పట్టివేత..

02-06-2026 08:00 PM

* అక్రమ ఇసుక రవాణాను ఉపేక్షించేది లేదు

పాపన్నపేట: మండలంలోని కుర్తివాడ గ్రామ శివారులో మంజీరా నది నుంచి సోమవారం అర్థరాత్రి సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి వెళ్లి పరిశీలించగా ఇసుక లోడ్ తో ఉన్న రెండు ట్రాక్టర్లు, ఇసుక తరలించేందుకు ప్రయత్నించిన మరో తొమ్మిది ట్రాక్టర్లను పట్టుకుని ఠాణాకు తరలించినట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ట్రాక్టర్ లను సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. మండలంలో మంజీరా నది, చెరువుల నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని వారు కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.