నవోదయకు ఎంపికైన అక్షరను అభినందించిన పాఠశాల యాజమాన్యం
19-03-2026 01:33 AM
భిక్నూర్, మార్చి 18 (విజయ క్రాంతి): ఇటీవల విడుదలైన నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో భిక్నూర్ మండలానికి చెందిన చైతన్య విద్యనికేతన్ పాఠశాల విద్యార్థిని నాగారం అక్షర అర్హత సాధించింది. మండలం నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థినిగా నిలిచిన అక్షరను పాఠశాల యాజమాన్యం ఘనంగా అభినందించింది.
ఈ సందర్భంగా కరెస్పాండెంట్ రేణు కుమార్ మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులు ప్రతి సంవత్సరం నవోదయ, పాలిసెట్, ఐఐఐటీ బసరా వంటి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ అశోక్ యాదవ్, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థిని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలు సాధించాలని ఆశీర్వదించారు.






