calender_icon.png 12 June, 2025 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంట మార్పిడి ద్వారా అధిక దిగుబడికి అవకాశం: వ్యవసాయ శాస్త్రవేత్త దామోదర్ రాజు

11-06-2025 02:04:44 PM

సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపూర్(Samsthan Narayanpur) మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద మండల వ్యవసాయ శాఖ  అధికారి రక్షిత ఆధ్వర్యంలో  రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆచార్య జయశంకర్ యూనివర్సిటీ శాస్త్రవేత్త దామోదర్ రాజు(Acharya Jayashankar University Scientist Damodar Raju), పరమేశ్వరి హాజరై రైతులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. మండల వ్యవసాయ అధికారి రక్షిత మాట్లాడుతూ... రైతులకు పంటలపై అవగాహన కల్పించడానికి ప్రతి రైతుకు శాస్త్రీయ పద్ధతులు తెలిసేలా చేయడం కోసం విత్తన శుద్ధి, వంగడాల రకం మేలైన పద్ధతులను రైతులతో చర్చించడానికి రైతు ముంగిట్లో శాస్త్రవేత్త కార్యక్రమన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

రైతులు విత్తనాలను లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దనే తీసుకోవాలని రసీదును భద్రపరుచుకోవడం ద్వారా విత్తన రకం వలన పంట నష్టం జరిగితే పరిహారం వచ్చేలాగా కృషి చేస్తామని తెలిపారు. వ్యవసాయ శాస్త్రవేత్త దామోదర రాజు మాట్లాడుతూ రైతులు పంట దిగుబడి కోసం అధికంగా యూరియాని వాడుతున్నారని అనవసరమైన రసాయనాలు వాడడం వల్ల పంట దిగుబడి తగ్గడంతో పాటు భూమి సాంద్రత కోల్పోతుందని తెలిపారు. వర్షపు నీటిని జాగ్రత్తగా ఇంకుడు గుంతల ద్వారా ఊట చెరువుల ద్వారా భూమిలోకి ఇంకేలాగ చేసుకుని భూగర్భ జనాలను  పెంచుకోవలని తెలిపారు. వరి పంటలో కొయ్య కాళ్లు, బంధు పురుగులను ఫతేరా, కెల్డన్ లాంటి మందుల ద్వారా నివారించవచ్చన్నారు.

పత్తి పంటలో గులాబీ రంగు పురుగును నివారించడం కోసం తక్కువ సమయంలో పంట కాలం పూర్తయ్యే వంగడాలను ఎన్నుకోవాలని సూచించారు. విపరీతమైన కెమికల్స్ ని వాడడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని యూరియా వాడకాన్ని తగ్గించాలని అన్నారు. రైతులకు అవసరమైన నాణ్యమైన వంగడాలు హైదరాబాదులోని రాజేంద్రనగర్ ఆచార్య జయశంకర్ యూనివర్సిటీ నందు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సమావేశంలో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన చేయడం లేదని రైతుల సమస్యలను పట్టించుకోవడంలేదని గుడిమల్కాపూర్ కి చెందిన రైతు రవీందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో సమావేశం రసాభాసగా మారింది. వ్యవసాయ అధికారి సర్ది చెప్పడంతో సద్దుమణిగింది. ఈ కార్యక్రమంలో ఏఈఓ సైదులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.