ఎస్పీఎఫ్ చేతికి సచివాలయం?
చీఫ్ సెక్రటరీ వద్ద ఫైల్
త్వరలో ఉత్తర్వులు జారీ?
ప్రస్తుతం టీఎస్ఎస్పీ పహారా
హైదరాబాద్, ఆగస్టు 18(విజయక్రాంతి): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం భద్రతను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్)కు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రక్రియ చివరి దశకు వచ్చినట్లు సమాచా రం. ప్రస్తుతం ఈ ఫైల్ సీఎస్ వద్ద ఉండగా.. ఈ నెలలో కాని, వచ్చే నెల మొదటి వారం లో కాని దీనికి ఆమోద ముద్రవేసే అవకా శం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెక్రటేరియెట్ భద్రతను తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ (టీఎస్ఎస్పీ) చూసుకుంటోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫిబ్రవరిలో టీఎస్ఎస్పీని తొలగించి ఎస్పీఎఫ్ను తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ రావడంతో అది సాధ్యం కాలేదు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం ఈ అంశం మళ్లీ చర్చకు వచ్చినట్లు తెలిసింది. సంబంధిత అధికారులు సీఎస్ వద్దకు ప్రతిపాదలను పంపినట్లు సమాచా రం. సీఎం, సీఎస్ అమెరికా పర్యటనకు వెళ్లడంతో అది మళ్లీ వాయిదా పడింది. ఇప్పు డు సీఎం విదేశీ పర్యటన ముగిసిన నేపథ్యంలో వీలైనంత త్వరలోనే దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
గతంలో ఎస్పీఎఫ్ ఆధ్యర్యంలోనే ..
ప్రస్తుతం సచివాలయానికి దాదాపు 650 మంది టీఎస్ఎస్పీ సిబ్బంది భద్రత కల్పిస్తున్నారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్, రిజర్వ్ ఫోర్స్ కలిపి సెక్రటేరియెట్కు నలువైపులా పహారా కాస్తున్నారు. ఇప్పుడు వీరి స్థానంలో ఎస్పీఎఫ్ సిబ్బందిని నియమించేందుకు రంగం సిద్ధమవుతోంది. వాస్తవానికి సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి కీలక కార్యాలయాలు, ప్రాంగణాలకు భద్రతను కల్పించేందుకు ఎస్పీఎఫ్ సిబ్బందిని నియమిస్తారు.
ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా, తెలంగాణ కొత్త సచివాలయం ప్రారం భం కాక ముందు కూడా సెక్రటేరియెట్ భద్రతను ఎస్పీఎఫ్ పర్యవేక్షించేది. కొత్త సచివాలయం ప్రారంభించిన తర్వాత నాటి బీఆర్ఎస్ సర్కారు అనూహ్యంగా ఎస్పీఎఫ్ను తొలగించి టీఎస్ఎస్పీకి భద్రతను అప్పగించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్పీఎఫ్కు తిరిగి సచివాలయం సెక్యూరిటీ బాధ్యతలను అప్పగించాలని కొన్ని విజ్ఞప్తులు వచ్చినట్లు సమాచారం. దీంతో ఎస్పీఎఫ్కు తిరిగి బాధ్యతలు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఎస్పీఎఫ్ అధికారులతో చర్చలు..
సచివాలయం భద్రతను తిరిగి అప్పగించే అంశంపై ఎస్పీఎఫ్ ఉన్నతాధికారులతో ప్రభుత్వం ఇప్పటికే చర్చించినట్లు తెలిసింది. అయితే సిబ్బంది సర్దుబాటు వల్ల ఈ ప్రక్రి య కొంత ఆలస్యమైనట్లు తెలిసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్పీఎఫ్ను పక్కన పెట్టిన తర్వాత వీరిని ఇతర చోట్ల సర్దుబాటు చేశా రు. ఇప్పుడు వారిని తిరిగి పాత స్థానాల్లోకి తీసుకొచ్చేందుకు కొన్ని సాంకేతిక సమస్య లు ఉన్న నేపథ్యంలో అవి క్లియర్ అయిన వెంటనే సీఎస్ నుంచి ఉత్తర్వులు వెలువడుతాయని తెలుస్తోంది.
కారణం లేకుండానే తొలగింపు..
బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త సచివాల యం ప్రారంభించిన తర్వాత అప్పటిదాకా సెక్రటేరియెట్ భద్రతను పర్యవేక్షించిన ఎస్పీఎఫ్ను ఒక్కసారిగా తొలగించింది. ఈ నిర్ణయంలో అప్పట్లో సచివాలయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలా ఎందుకు చేసిందో చెప్పడంలో నాటి ప్రభుత్వ స్పష్టత ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయంలో చాలా మార్పు చేసింది. ఈ క్రమంలోనే టీఎస్ఎస్పీని కూడా మార్చ డం ద్వారా సమూల మార్పు చేసినట్లు అవుతుందని ప్రభుత్వం భావించి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.






