12-06-2025 09:41:48 AM
తెలుగు సినీ పరిశ్రమలో(Telugu film industry) మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ సినీ నిర్మాత, ఎఎ ఆర్ట్స్ అధినేత కావూరి మహేంద్ర( Kavuri Mahendra passes away) కన్నుమూశారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12 గంటల సమయంలో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కావూరి మహేంద్ర 50 పైగా సినిమాలు నిర్మించారు. గీత ఆర్ట్స్ పిక్చర్స్, ఏఏఆర్ట్స్ బ్యానర్ పైనా చిత్ర నిర్మాణం చేశారు. కావూరి మహేంద్ర ఏఏ ఆర్ట్స్ బ్యానర్ లో శ్రీహరిని(Srihari) హీరోగా పరిచయం చేస్తూ 'పోలీస్' చిత్రాన్ని నిర్మించారు.
తర్వాత శ్రీహరితో దేవా చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు గోపీచంద్ మలినేనిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. నేడు గుంటూరులోని మహా ప్రస్థానంలో కావూరి మహేంద్ర అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కావూరి మహేంద్ర 1946 ఫిబ్రవరి 4న గుడివాడ తాలుకు దోసపాడులో జన్మించారు. దర్శకత్వంలో శిక్షణ పొందిన మహేంద్ర నిర్మాతగా మారారు. 1977లో ప్రేమించి పెళ్ళి చేసుకో సినిమాతో నిర్మాతగా మారిన ఆయన ఏది పుణ్యం? ఏది పాపం?, ఆరని మంటలు, తోడు దొంగలు, బందిపోటు రుద్రమ్మ, ఎదురలేని మొనగాడు, ఢాకూరాణి, ప్రచండ భైరవి, కనకదుర్గ వ్రత మహాత్మ్యం తదితర చిత్రాలను నిర్మించారు. ఆయన మృతిపై టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు తమ సంతాపాన్ని ప్రకటించారు.