09-11-2025 02:32:28 PM
* పాపన్నపేట ప్రజలను వెన్నాడుతున్న సమస్యలు
* తూతూ మంత్రంగా పారిశుద్ధ్యం నిర్వహణ
* పరిష్కరించడంలో అధికారులు విఫలం
పాపన్నపేట,(విజయక్రాంతి): గ్రామాల్లో మురుగుపారుదల వ్యవస్థను ఎప్పటికప్పుడు చక్కదిద్దుతున్నాం.. ఎప్పటికప్పుడు చెత్తాచెదారం శుభ్రం చేయిస్తున్నాం.. వాడ వాడలా నీటి ఎద్దడి లేకుండా చూస్తున్నాం.. ఇవి మన అధికారులు, పాలకులు చెబుతున్న మాటలు. వారి మాటలు వట్టి మూటలుగా మారుతున్నాయె తప్ప ఎక్కడ ఆచరణలో అమలు కావడం లేదు. దీంతో మురుగు, చెత్తాచెదారం, నీటి సమస్యలతో గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మండల కేంద్రం పాపన్నపేటలో మురుగు కాలువలు సక్రమంగా లేకపోవడం, ఎప్పటికప్పుడు మురుగు కాలువలను శుభ్రం చేయకపోవడంతో మురుగుపారుదల అధ్వానంగా మారింది. చినుకు పడితే మురుగు కాలువలు నుండి మురుగు రోడ్డుపై ప్రవహిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ళ ముందు మురుగు నిలిచి దుర్వాసన వెదజల్లుతూ దోమలు విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఇంటి బయట ఉండాలంటే దోమలతో భయమేస్తోందంటున్నారు. మురుగు కాలువల వెంట పిచ్చి మొక్కలు పెరిగి మురుగు ముందుకు సాగడం లేదు. దీంతో దోమల ఆవాసాలుగా మారుతున్నాయి.
డంపింగ్ యార్డ్ పక్కనే చెత్త పారబోత..
గ్రామంలో సేకరించిన చెత్తాచెదారాన్ని డంపింగ్ యార్డ్ లో వేరు చేయకుండా, నిర్లక్ష్యంగా డంపింగ్ యార్డ్ పక్కనే కుప్పలుగా పోస్తున్నారు. దీంతో దుర్వాసన వెదజల్లడమే కాకుండా డంపింగ్ యార్డ్ నిరుపయోగంగా మారింది. రూ.లక్షల ప్రజల ధనం వృధాగా మారుతోంది.
బోరు మోటారు నుంచి ట్యాంకుకు నీటి సరఫరా లేకపోవడంతో..
గ్రామంలో సింగిల్ ఫేజ్ బోరు మోటార్ల వద్ద ఏర్పాటు చేసిన ట్యాంకులకు బోరు మోటార్ల నుంచి నీటి సరఫరా లేకపోవడంతో నిత్యం నీరు వృధాగా పోతోంది. ట్యాంకులకు నీటి సరఫరా చేసి వినియోగంలోకి తీసుకువస్తే నీరు, విద్యుత్తు వృధాను అరికట్టవచ్చు.
పారిశుద్ధ్యం కొరవడి..
పాపన్నపేటలో పారిశుద్ధ్య పనులు కుంటుపడ్డాయి. గ్రామంలో కనీసం నెల రోజులకోసారి కూడా పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదని ఆయా వాడల ప్రజలు మండిపడుతున్నారు. మురుగు కాలువలను శుభ్రం చేయకపోవడంతో పిచ్చి మొక్కలు, మురుగు పేరుకు పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతాం: పాపన్నపేట ఎంపీడీవో విష్ణువర్ధన్
డంపింగ్ యార్డ్ పక్కనే చెత్త పారబోస్తున్న విషయం నిజమే. గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. మురుగు కాలువలను శుభ్రం చేయిస్తాం. సింగిల్ ఫేస్ బోరు మోటారు నుంచి ట్యాంకులకు నీటి సరఫరా చేపడతాం. ప్రజలు సైతం విద్యుత్తు, నీటి వృధాను అరికట్టాలి. అవసరం తీరాక బోరు మోటారు స్విచ్ ఆఫ్ చేయాలి.