స్నేహితురాలికి చేయూతనిచ్చిన ఎస్ఎస్సీ మిత్రబృందం
ధర్మపురి,(విజయక్రాంతి): స్నేహితులు కలిసి తీసుకున్న నిర్ణయo పలువురికి ఆదర్శంగా నిలవడమే కాకుండా ఇతర స్నేహితులను ఆలోచింపజేసింది. వెల్గటూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 2005-2006 విద్యా సంవత్సరoలో పదవ తరగతి చదువుకున్న స్నేహితలందరూ కలిసి తమతో కలిసి చదువుకున్న స్నేహితురాలు కష్టాల్లో ఉందనీ తెసుకుని చలించిపోయారు. మండలంలోని కప్పారావుపేట గ్రామానికి చెందిన దమ్మ మమత భర్త రమేష్ ను ఇటీవల కోల్పోయింది.
మమత ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న 2005-2006 పదవ తరగతి మిత్రబృందం తమ శక్తిమేర ఆర్థిక సాయం అందించారు. దుఃఖంలో ఉన్న స్నేహితురాలికి ధైర్యం చెప్పడమే కాకుండా, వారు ఆమె కూతురు భవిష్యత్తు కోసం ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. స్నేహితులందరూ కలిసి విరాళాలు సేకరించి, ఆ మొత్తాన్ని ఆమె కూతురు పేరు మీద రూ.27,000/- లను పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ బాండును మమతకు అందించారు. ఈడబ్బు ఆమె చదువుకు, భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.






