19-11-2025 12:00:00 AM
హనుమకొండ,నవంబర్ 18 (విజయ క్రాంతి):బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో చేర్పించి, చట్టబద్ధత కల్పించేలా డిసెంబర్ 1నుండి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇండియా కూటమిలోని 243 మంది పార్లమెంట్ సభ్యులతో స్తంబింపజేసేలా కృషి చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ అన్నారు.రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపులో భాగంగా మంగళవారం వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం కావ్యతో ములాఖత్ సందర్భంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల కోటాలో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ, అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదింపజేసి, చేతులు దులుపుకోవడం కాదని, బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కలిగించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీ, రాష్ట్రపతిలను కలిసి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదింపజేసిన బీసీ బిల్లుకు రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో చేర్పించి, రిజర్వేషన్లకు చట్టబద్ధత కలిగించేలా ఒత్తిడి తేవాలని, లేకుంటే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఒప్పించి, ఇండియా కూటమిలోని 243 మంది పార్లమెంట్ సభ్యులచే పార్లమెంట్ ను స్తంభింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రములో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 42 శాతం బీసీ రిజర్వేషన్లు బిల్లు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదింప జేసిన బిల్లును కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని, కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేసి బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో చేర్పించి బీసీ రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్ధత కల్పించేలా కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమించాలని, లేనియెడల రాష్ట్రంలో బీసీలంతా కలిసి అగ్గి రాజస్తామని హెచ్చరించారు.
బీసీ జేఏసీ నేతలతో మూలాఖత్ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈవి శ్రీనివాసరావు, బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు దాడి మల్లయ్య యాదవ్, బోనగాని యాదగిరి గౌడ్, తమ్మేలా శోభారాణి, డాక్టర్ చిర్ర రాజు, అరేగంటి నాగరాజు, వేముల మహేందర్, డ్యాగల శ్రీనివాస్, తడక సుమన్, కాసగాని అశోక్, పంజాల మధు, కోలా ప్రతాప్, పెరుమాండ్ల అనిల్, శంకర్, తుపాకుల రవి, కడారి సురేష్ తదితరులుపాల్గొన్నారు.