19-11-2025 12:00:00 AM
జాతీయస్థాయిలో ర్యాంకులు సాధించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ, నవంబర్ 18 (విజయ క్రాంతి): ప్రభుత్వ జూనియర్, వివిధ గురుకుల కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను నీట్, జేఈ, ఎంసెట్, తదితర పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచే విధంగా కోచింగ్ ఇవ్వాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఇంటర్మీడియట్, సాంఘిక సంక్షేమ, బిసి, మైనారిటీ, గిరిజన సంక్షేమ విద్యాలయాల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏయే విద్యాసంస్థల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లలో నీట్, జేఈ, ఎంసెట్, ఇతర పోటీ పరీక్షలకు కోచింగ్, విద్యార్థుల ఎంపికకు ఎలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, సెంటర్ ఆఫ్ ఎక్స్సేలెన్స్ ల్లో టెస్టు లను నిర్వహిస్తున్నారా అని అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలసముద్రంలో గిరిజన విద్యార్థులకు స్టెమ్ -60 అనే కార్యక్రమంతో నీట్, ఎంసెట్, జెఈఈ కోచింగ్ ఇస్తున్నారని, ఇదే తరహాలో ప్రభుత్వ జూనియర్, వివిధ గురుకుల జూనియర్ కళాశాలల్లోనూ కోచింగ్ ను నిర్వహించాలన్నారు.
ఇందుకు విద్యార్థుల ఎంపికకు సంబంధించి మూడు విడతలుగా పరీక్షలను నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నీట్, ఎంసెట్,జేఈఈ,ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసి జాతీయస్థాయిలో ర్యాంకులు సాధించేలా కృషి చేయాలన్నారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ, కేజీబీవీ, టిఎస్ఆర్జెసి, మైనారిటీ, మోడల్ జూనియర్ కళాశాలల విద్యార్థులకు కోచింగ్ ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, డిఆర్వో వై.వి. గణేష్, డీటీడబ్ల్యూవో ప్రేమ కళ, బీసీ సంక్షేమ అధికారి నరసింహస్వామి, హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల సీనియర్ లెక్చరర్ శ్రీధర్, వివిధ గురుకులాల ఆర్సిఓలు, అధికారులుపాల్గొన్నారు.