27-12-2025 09:17:20 PM
* జిల్లా ఎస్పీ చేతుల మీదుగా రివార్డ్ అందుకుంటున్న గరిడేపల్లి ఎస్ఐ
* అందరి సహకారంతోనే సాధ్యమైంది ఎస్ఐ చలికంటి నరేష్
గరిడేపల్లి,(విజయక్రాంతి): మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గరిడేపల్లి మండలంలో పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించి విధి నిర్వహణలో తన ప్రతిభను చాటుకున్న ఎస్ఐ చలిగంటి నరేష్ పనితీరుకు ఉన్నతాధికారుల గుర్తింపు లభించింది. ఎన్నికల విధుల్లో సమర్థత, ముందస్తు ప్రణాళిక, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో శాంతిభద్రతలను కాపాడినందుకు సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ ఎస్ఐ నరేష్ కు క్యాష్ రివార్డు అందజేశారు. జిల్లాలోనే పెద్ద మండలంగా గుర్తింపు పొందిన గరిడేపల్లిలో సామాజికంగా, రాజకీయంగా చైతన్యవంతమైన గ్రామాలు ఉన్నాయని, వీటితోపాటు సమసాత్మకమైన గ్రామాలు ఎక్కువగా ఉండటంతో ఎన్నికల నిర్వహణ ప్రతిసారి పోలీసు శాఖకు సవాల్గా ఉంటుంది.
.ఎన్నికలు ఎప్పుడు జరిగినా సమస్యత్మక గ్రామాల్లో ఏదో ఒక ఘర్షణ జరిగేది. ఈసారి జరిగిన ఎన్నికల్లో ఎక్కడా ఉద్రిక్తతలకు చోటివ్వకుండా, అన్ని గ్రామాల్లో శాంతియుత వాతావరణంలో పోలింగ్ పూర్తయ్యేలా ఎస్సై నరేష్ ప్రత్యేక దృష్టి పెట్టి ఫలితాన్ని సాధించారు. స్థానిక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా పోలీస్ శాఖ సమన్వయంతో చేపట్టిన చర్యలు ఫలితమిచ్చాయి. గ్రామాలలో బందోబస్తు, నిరంతర పర్యవేక్షణ, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బృందాల ఏర్పాటు వంటి చర్యలతో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగింది. ఎస్సై చలిగంటి నరేష్కు క్యాష్ రివార్డు అందజేయడంపై మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గరిడేపల్లి ఎస్ఐ చలి కంటి నరేష్ మాట్లాడుతూ... గరిడేపల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది పూర్తి సహకారంతోనే తనకు ఈ రివార్డు దక్కిందని తెలిపారు. తనతోపాటు స్టేషన్ లో పనిచేసే సిబ్బంది అందరికీ ఈ ఘనత దక్కుతుందని ఆయన తెలిపారు. మండలంలో స్థానిక సర్పంచ్ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేందుకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీ నాయకులకు, పోలింగ్ సిబ్బందికి, మండల అధికారులకు, పోలీసు సిబ్బందికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.