25-08-2025 01:43:00 AM
కే.కే మహేందర్ రెడ్డి.కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్
రాజన్న సిరిసిల్ల: ఆగస్టు 24 (విజయక్రాంతి) సిరిసిల్ల నియోజకవర్గ శాసనసభ్యులు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు వల్లె సిరిసిల్ల నేతన్నలు సమస్యల్లో కూరుకుపోయారని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కే.కే. మహేందర్ రెడ్డి విమర్శించారు. ఆదివారం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కే.కే.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సిరిసిల్ల నేతన్నల సమస్యలపై సిరిసిల్ల నియోజకవర్గ శాసనసభ్యులు, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్ల నేతన్నల గురించి మంత్రులకు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.
గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా బతుకమ్మ చీరల ఆర్డర్ పేరుతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను విధ్వంసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్ల నేత పరిశ్రమను బాగు చేసేందుకు 50 కోట్లతో నూలు బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగిందని గతంలో ఉన్న బతుకమ్మ చీరల బకాయిలను చె ల్లించడం జరిగింది అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం సిరిసిల్ల నేతన్నలను కేటీఆర్ స్వార్థ రాజకీయాల కోసం వాడుకున్నారని ఆరోపించారు.
నేతన్నలకు ఉపాధి కల్పించడం కోసం ఇందిరా మహిళా శక్తి ద్వారా 2.70 కోట్ల చీరల ఉత్పత్తికి ఆర్డర్ ఇవ్వడం జరిగిందని అన్నారు. ట్రిప్టు పథకం ద్వారా ప్రభుత్వం నేతన్నలకు లబ్ధి చేకూర్చిందని తెలిపారు. 26వ తేదీ న ట్రిప్టు పథకం ద్వారా నేతన్నలకు మరోసారి లబ్ధి చేకూర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో ‘కేటీఆర్ ‘ లేఖల డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. సిరిసిల్ల నేతన్నలకు వాస్తవాలు తెలుసని ఇలాంటి నాటకాలు కట్టిపెట్టాలని అన్నారు. సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.