28-05-2025 12:00:00 AM
ముందుకు సాగని మురుగునీరు కోట్లు వెచ్చించిన ప్రయోజనం శూన్యం
మహబూబాబాద్, మే 26 (విజయ క్రాంతి): కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించే డ్రైనేజీ పనుల్లో ‘ముందుచూపు లేమి’ కారణంగా మురుగునీరు ముందుకు సాగకుండా ఎక్కడికక్కడే తిష్ట వేయడంతో డ్రైనేజీలన్ని దుర్గంధ భరితంగా మారాయి. పల్లె.. పట్నం తేడా లేకుండా నిర్మించిన సైడ్ కాలువల్లో అనేకచోట్ల మురుగునీరు ఎక్కడికక్కడే తిష్ట వేస్తోంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంతోపాటు తొర్రూరు, డోర్నకల్, మరిపెడ, కేసముద్రం మున్సిపాలిటీలతోపాటు జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.
లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన మురుగు కాలువల ద్వారా మురుగునీరు ముందుకు వెళ్లకుండా ఎక్కడికక్కడే తిష్ట వేసి దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. వేసవి కాలంలోనే ఇలా దుర్గంధ భరితంగా డ్రైనేజీలు ఉండగా, వచ్చే వర్షాకాలంలో పరిస్థితి ఏమిటని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేకచోట్ల డ్రైనేజీలు నిర్మించే సమయంలో మురుగునీరు దిగువకు వెళ్లేందుకు అవసరమైన ప్రణాళిక లేకుండా డ్రైనేజీ కాలువలను నిర్మించి వదిలేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఫలితంగా సైడ్ కాలువల్లో మురుగునీరు, చెత్త ముందుకు సాగకుండా ఎక్కడికక్కడే నిలుస్తోందని చెబుతున్నారు. దీనికి తోడు నిత్యం శుభ్రం చేయకపోవడం వల్ల దుర్గంధ భరితంగా మారి కంపు కొడుతున్నాయని వాపోతున్నారు. అనేక గ్రామాలు, పట్టణాల్లో ఇలాంటి పరిస్థితి ఉందని చెబుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గత ప్రభుత్వ హాయంలో ప్రధాన రోడ్లను విస్తరించి ప్రత్యేకంగా డ్రైనేజీ నిర్మించారు.
అయితే ఆర్టీసీ బస్టాండ్ వైపు నుంచి ఈదుల పూసపల్లి వైపు ఎన్టీఆర్ స్టేడియం వరకు డ్రైనేజీ నిర్మించి వదిలేశారు. దీంతో మురుగునీరు ముందుకు వెళ్లకుండా ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. దీనితో జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారి వెంట ఉన్న డ్రైనేజీ కంపుకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇదే కాకుండా పలు కాలనీల్లో కూడా డ్రైనేజీ నిర్మాణాలు ‘గమ్యం’ లేనివిధంగా నిర్మించడంతో ప్రయోజనం శూన్యంగా మారిందని వాపోతున్నారు. మున్సిపల్, పంచాయతీ అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాలను పూర్తి చేయడంతో పాటు, మురుగునీరు ఎక్కడికక్కడే నిల్వకుండా దిగువకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
నిష్ప్రయోజనంగా డ్రైనేజీ
సైడ్ కాలువ నిర్మాణం చేపడుతున్న సమయంలోనే మురుగునీరు ముందుకు వెళ్ళేది ఎలా అంటూ అడిగాం. ముందు కాల్వ కట్టనివ్వండి.. ఆ తరువాత దిగువకు మురుగునీరు వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటాం అన్నారు. సరే లక్షల రూపాయలతో కాల్వ కడుతున్నారు కదా..
దిగువకు వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటారని ఆశించాం. కాల్వ కట్టారు బిల్లు తీసుకున్నారు. దిగివకు వెళ్లే చర్యలు మాత్రం తీసుకోలేదు. దీంతో మురుగు నీరు అంతా ఇక్కడే తిష్ట వేసి నిష్ప్రయోజనంగా మారి, కొత్త సమస్యగా మారింది. కాల్వ పరిస్థితిని వివరించి అధికారులను అడిగితే, మీ ఇండ్లలో ఎక్కడికక్కడే ఇంకుడు గుంతలు తీసుకోండని సమాధానం ఇస్తున్నారు.
యాకూబ్, స్థానికుడు, జమలాపురం