15-09-2025 09:04:04 AM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్(Abdullapurmet ) వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులు సరళ మైసమ్మ వద్దకు వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. బెంగుళూరు గేట్ నుంచి పోచారం వైపు వెళ్తుండగా కారు బోల్తా పడిందని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.