08-10-2025 08:10:17 AM
షాహినా బేగంపై దాడి చేసిన నిర్మల, యాదిరెడ్డిలు
ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి
కులాంతర వివాహమే హత్యకు మూలం
సిద్దిపేట జిల్లా బస్వాపూర్ లో ఘటన
జగదేవపూర్,(విజయక్రాంతి): పిల్లల కులాంతర వివాహం పెద్దల మధ్య ఘర్షణకు దారితీసింది. రెడ్డి కుటుంబానికి చెందిన అమ్మాయిని ముస్లిం కుటుంబం అబ్బాయి పెళ్లి చేసుకున్నాడని షహీన బేగంపై ఇనుపరాడుతో నిర్మల యాదిరెడ్డి (భార్య భర్తలు)లు దాడి చేశారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో జరిగింది. గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, జగదేవపూర్ ఎస్సై కృష్ణారెడ్డి, గ్రామస్తులు తెలిపిన వివరాలు. గ్రామానికి చెందిన నిర్మల, యాదిరెడ్డి దంపతుల కూతురు అపర్ణ, అదే గ్రామానికి చెందిన షాహినా బేగం కుమారుడు ఎస్ కే అబ్బాస్ లు ఏడాది క్రితం ప్రేమ పెళ్లి చేసుకొని హైదరాబాదులో కాపురం చేశారు.
కొద్దిరోజుల పాటు మనస్పర్ధలతో ఎవరింటికి వారు గత నెల చేరుకున్నారు. తిరిగి మంగళవారం అబ్బాస్, అపర్ణ ఇద్దరు కలిసి ఇంటి నుండి వెళ్లిపోయారు. దీంతో కోపానికి గురైన యాదిరెడ్డి అబ్బాస్ ఇంటిని తగలబెట్టడానికి వెళ్లాడు. కానీ షాహినా బేగం(60) ఉండడంతో ఆమెపై ఇనుపరాడ్ తో దాడి చేసి తలపై బలంగా కొట్టాడు. దీంతో షాహినా బేగం తలకు తీవ్ర గాయాలై పడిపోవడంతో స్థానికులు ఆమెను గజ్వేల్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. నిందితులు యాదిరెడ్డి నిర్మల పరారీలో ఉన్నట్లు రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, ఎస్సై కృష్ణారెడ్డి వెల్లడించారు. కాగా సంఘటన స్థలంలో క్లూస్ టీం ఆధారాలు స్వీకరించారు. షాహినా బేగం మృతి చెందిన విషయాన్ని పోలీసులు అబ్బాస్ కు సమాచారం అందించడంతో తిరిగి ఇంటికి చేరుకున్నారు.