28-06-2025 08:01:00 PM
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): జిల్లాలో రైతులను, అమాయక ప్రజలను టార్గెట్ చేసుకొని కొందరు మోసగాళ్లు షేర్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు అంటూ అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారని అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, అధిక వడ్డీ ఆశకు పోతే అసలుకే ఎసరు అవుతుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శనివారం తెలిపారు. జిల్లాలో ఎవరైనా అమాయక ప్రజలను, రైతులను అధిక వడ్డీ ఇస్తామని మభ్యపెట్టీ వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లాలో కొంత మంది ప్రజలు ఇండ్ల భూములు, వ్యవసాయ భూములు, బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి మరి అక్రమ వ్యాపారాలకు అధిక వడ్డీ ఆశకు డబ్బులు ఇస్తున్నారని వారు మొదటగా కొంత మొత్తంలో ఇస్తూ ఆశ చూపించి పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వగానే మోసాలకు గురి చేస్తారని అలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. సొంత చుట్టాలు, చుట్టూ పక్కన వాళ్ళను ఎంచుకొని మన మద్యలో ఉంటూ ఎక్కడికి వెళ్ళడు మనవాడిలా నమ్మిస్తూ వ్యాపారాలు చేస్తున్నారు.అలాంటి వారి స్తోమతను గమనించి పెట్టుబడి పెట్టాలని సూచించారు. ఎవరైనా ఫైనాన్స్ వ్యాపారాలు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.
అలాగే ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుంటూ అధిక వడ్డీలను వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ లైసెన్స్ లేకుండా వడ్డీ వ్యాపారం నిర్వహించడం చట్టరీత్యా నేరం అని తెలియజేస్తూ, వడ్డీకి డబ్బులు ఇచ్చి దానికి బదులుగా భూమిని తమ పేర్లపై సేల్ డీడ్లను చేసుకోవడం చట్టరీత్యా నేరం అని పేర్కొన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో సైబర్ నేరాల పట్ల అనేక అవగాహన సదస్సులు కల్పించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఎవరైనా అధిక వడ్డీలు వసూలు చేసిన, అధిక వడ్డీలు ఇస్తామని మభ్యపెట్టీ డబ్బులు వసూలు చేసిన అలాంటి వారి సంబంధిత పోలీసు స్టేషన్కు సమాచారం అందించాలనీ కోరారు.