01-11-2025 05:57:07 PM
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి..
నిజామాబాద్ (విజయక్రాంతి): ప్రజల విసృత ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ నవంబర్ 15న కోర్టు ప్రాంగణాలలో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జి. వి. ఎన్ భారత లక్ష్మీ తెలిపారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని తన చాంబర్లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావులతో కలిసి విలేఖరులతో మాట్లాడారు. రాజీపడదగిన 1328 క్రిమినల్ కేసులను గుర్తించామని, వాటిని లోక్ అదాలత్ బెంచ్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విబేధాలు వచ్చినప్పుడు సర్దుకుని రాజీమార్గంలో వెళ్లడమే ఉత్తమమని పేర్కొన్నారు.
ఆర్మూర్, బోధన్ కోర్టు ప్రాంగణాలతో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో ప్రత్యేక లోక్ అదాలత్ జరుగుతుందని ఆమె వివరించారు. లోక్ అదాలత్ వైపు వెళ్లే మార్గానికి కక్షిదారులను ప్రోత్సహించాలని పౌరసమాజానికి జిల్లా జడ్జి విజ్ఞప్తి చేశారు. మనిషి సంఘజీవి అని సమాజంలో అందరితో కలిసి శాంతియుతంగా జీవించే సమయాలలో సమస్యల విషవలయంలో చిక్కుకోరాదని ఆమె అన్నారు. శాంతియుత సహజీవనమే ప్రజల జీవన విధానంగా మారాలని ఆమె సూచించారు. ప్రజల న్యాయపరమైన వివాదాలు, త్వరితిగతిన రాజీపద్దతి విధానంలో పరిష్కరించుకోవడానికి న్యాయసేవల చట్టం అత్యుత్తమని జిల్లాజడ్జి భారత లక్ష్మీ తెలియజేశారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ స్పెషల్ లోక్ అదాలత్ కు పోలీసు శాఖ సంపూర్ణ మద్దతునిస్తు, విజయవంతానికి కృషి చేస్తుందని తెలిపారు.
చిన్న చిన్న క్రిమినల్ కేసులు, క్షణిక ఆవేశంలో చేసిన రాజీ పడదగిన కేసులు స్పెషల్ లోక్ అదాలత్ పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ మానస పుత్రిక "స్పెషల్ లోక్ అదాలత్" అని ఆయన అభివర్ణించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మితో కలిసి, సమన్వయము చేసుకుంటు ప్రత్యేక లోక్ అదాలత్ విజయవంతానికి ప్రత్యేక కార్యాచరణతో కలిసి నడుస్తున్నామని ఆయన అన్నారు. అందరి దారులు ప్రత్యేక లోక్ అదాలత్ వైపు కదలాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అకాక్షించారు. న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు మాట్లాడుతూ న్యాయవాదులను, న్యాయమూర్థులను, పోలీసు అధికారులను సమన్వయం చేసుకుంటు న్యాయ వివాదాలను న్యాయార్థుల అభీష్టం మేరకు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.